Saturday, December 24, 2011

మీడియం తో నిమిత్తం లేకుండా సివిల్స్ 2012 సాధించండిలా .!


సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఈ పేరు వింటేనే కొంతమంది ఓ బ్రహ్మ పదార్థంగా.. మేధావులకే పరిమితమైందిగా భావిస్తారు. మెట్రోపాలిటన్ నగరాలు, ఇంగ్లిష్ మీడియం నేపథ్యంతోనే విజయం సాధ్యం అనే అభిప్రాయం (అపోహ) తో ఉంటారు. అయితే ఇది ఎంతమాత్రం వాస్తవం కాదు. సివిల్స్ విజయానికి కావల్సింది అకడెమిక్, ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్ కాదు. సాధించాలనే ‘విల్’ పవర్. సివిల్స్-2012 నోటిఫికేషన్ ఫిబ్రవరిలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ పరీక్ష విధి విధానాలు, అభ్యర్థుల అనుమానాలపై విశ్లేషణలతో పరీక్షకు సన్నద్ధం చేసేలా నిపుణుల సలహాలు..

దేశంలోనే అత్యున్నత సర్వీసులుగా పేర్కొనే ఐఏఎస్, ఐపీఎస్, తదితర ఇరవైకి పైగా కేంద్ర సర్వీసుల్లో అధికారులను ఎంపిక చేసే ప్రక్రియే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. దీన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపడుతుంది. ప్రపంచంలోనే అత్యంత క్లిష్ట ఎంపిక విధానంగా పేరుపొందిన పరీక్ష ఇది.

సహనం ఎంతో అవసరం:
సివిల్స్ ఔత్సాహికులకు ప్రథమంగా ఉండాల్సిన ప్రధాన లక్షణం సహనం. కారణం.. దీని ఎంపిక ప్రక్రియే ఏడాదిపాటు ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో ఉండే ఈ ఎంపికలో ప్రిలిమ్స్ మే నెలలో జరుగుతుంది. చివరి దశ ఇంటర్వ్యూ పూర్తయి ఫలితాలు వెల్లడయ్యేది ఆ తదుపరి సంవత్సరం మే లోనే. ఇంత సుదీర్ఘ ప్రక్రియతో కూడి ఉండే పరీక్ష సివిల్స్.

కోచింగ్ వర్సెస్ సెల్ఫ్ స్టడీ:
సివిల్స్ వంటి అత్యున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకున్న అభ్యర్థులకు మొదటగా తలెత్తే సందేహం కోచింగ్ గురించే. కోచిం గ్ తీసుకుంటేనే విజయం సాధ్యమనే అభిప్రాయం బలం గా ఏర్పడింది. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు కోచింగ్ తీసుకోకుండానే, కేవలం ఇంటర్వ్యూ గెడైన్స్ తీసుకుని విజయం సాధించినవారున్నారు. సివిల్స్ 2009లో విజేతగా నిలిచిన దేవిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి సొంత ప్రిపరేషన్‌తోనే విజయం సాధించారు. ఇలా మరెందరో ఉన్నారు. కాబట్టి.. కోచింగ్ అవసరం అని కచ్చితంగా చెప్పలేం.

అయితే కోచింగ్ తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా లాభిస్తుందని చెప్పొచ్చు. అభ్యర్థులు బలంగా ఉన్న సబ్జెక్టులకు సొంతంగా సిద్ధమై, బలహీనంగా ఉన్న సబ్జెక్టులకు కోచింగ్ తీసుకోవచ్చు. ఎక్కువమంది అభ్యర్థులు చేసేది ఇదే. అయితే కోచింగ్ వల్ల మంచి సహచరులు పరిచయమవుతారు. దానివల్ల బృంద చర్చలకు ఆస్కారం ఉంటుంది.

తెలుగు మీడియంతో సాధ్యమేనా:
సివిల్స్ అందుకునేందుకు కావాల్సిన పరిశ్రమ, సహనం ఉన్నవారికి ఏ మీడియమైనా ఒకటే. తెలుగు మీడియంలో సివిల్స్ రాసి విజేతలుగా ఎంపికైనవారెందరో. అంటే.. సివిల్స్‌లో విజయానికి కావాల్సిందల్లా కష్టపడి చదవడమే. ఈ క్రమంలో మొదటిసారే విజయం సాధ్యం కాకపోవచ్చు. కొంతమంది మూడుసార్లు పరాజితులై చివరిదైన నాలుగో అటెంప్ట్‌లో విజయం సాధించారు. ఇలాం టి వారిని ప్రేరణగా తీసుకోవాలి. రెండు, మూడుసార్లు పరాజయాలు పలకరించినా బెదరక రెట్టించిన ఉత్సాహంతో ఎగసే కెరటంలా చెలరేగాలి.

కాకపోతే ఇంగ్లిష్‌లో మెటీరియల్ లభ్యత ఎక్కువ. ఒకప్పుడు తెలుగులో మెటీరియల్ కొన్ని సబ్జెక్టుల్లోనే లభించేది. ఇప్పుడు దాదాపు అన్ని సబ్జెక్టుల్లోనూ మెటీరియల్ విరివిగా దొరుకుతుంది. ఇంగ్లిష్‌లో కొంచెం బలహీనంగా ఉన్న అభ్యర్థులు, ఇంగ్లిష్‌లో మాత్రమే లభించే మెటీరియల్ విషయంలోనూ ఆందోళన చెందక్కర్లేదు. అలాంటి మెటీరియల్‌లోని సమాచారాన్ని తెలుగులోకి అనువదించుకుని చదువుకోవడం వల్ల ఆ సమస్య నుంచి గట్టెక్కొచ్చు.

మంచి అకడెమిక్ నేపథ్యం లేకపోయినా:
చాలామంది అకడెమిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించినవారు మాత్రమే సివిల్స్ సాధించగలరని అపోహ పడుతుంటారు. ఇది సరికాదు. గతంలో సివిల్స్‌లో విజేతలుగా నిలిచిన వారిలో చాలామంది అకడెమిక్ పరీక్షలో సాధారణ మార్కులు సాధించినవారే. కాబట్టి ఎక్కడ, ఏం చదివారు అనే దానికంటే సివిల్స్ దృక్కోణంలో ఒక అంశాన్ని ఎలా చదివారు, ఏం గ్రహించారు, చక్కని భావవ్యక్తీకరణ, తప్పులను సరిదిద్దుకోగల నేర్పు ఉన్నవారు తేలికగా విజయం సాధించొచ్చు.

అకడెమిక్స్‌కు అదనంగా:
సివిల్స్ ఔత్సాహికులకు అకడెమిక్స్‌కు అదనంగా కొన్ని సహజ లక్షణాలు అలవర్చుకోవాలి. అవి.. చేసే పనిపట్ల ప్రేమ, పట్టుదల, ప్రణాళిక, పరిశ్రమ, అణకువ, అంకిత భావం, ఆత్మ స్థైర్యం, ఆత్మ విమర్శ, ఏ విషయం చదివినా గ్రహించడంలో స్పష్టత, వ్యక్తీకరించడంలో సరళత, వివరించడంలో సంగ్రహత. ప్రతిరోజూ రేడియో వార్తలు వినడం, వివిధ దినపత్రికలను చదవడం, చదివినదానిపై ఆలోచించి సహచరులతో చర్చించడం, సామాజిక సమస్యల పట్ల సానుభూతితో స్పందించడం. నిజాయితీతో, నిర్భయంగా, నమ్రతతో చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలగడం. వీటిని పెంపొందించుకుంటే భావి విజేతలుగా అవతరించొచ్చు.

అర్హతలివే:
గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: ఆగస్టు 1, 2012 నాటికి 21-30 ఏళ్లు. బీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు.
ఎన్నిసార్లు రాయొచ్చు: ఓసీలు వయోపరిమితికి లోబడి గరిష్టంగా నాలుగుసార్లు, ఓబీసీలు ఏడుసార్లు, ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లైనా రాయొచ్చు. అయితే ఈ మూడంచెల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో) ఎందులో విఫలమైనా మొదటి నుంచి ప్రస్థానం మొదలుపెట్టాలి. ఉదాహరణకు ఒక అభ్యర్థి ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలో విఫలమైతే..మళ్లీ ప్రిలిమ్స్ నుంచి రాయాలి. అంతేకాకుండా ప్రిలిమ్స్‌లో ఒక్క పేపర్‌కు హాజరైనా ఒక ప్రయత్నం పోయినట్లే. అత్యుత్తమంగా ప్రిపరేషన్ ఉందనుకుంటేనే రాయడం మంచిది.

ఎవరికైనా సాధ్యమే
గత దశాబ్ద కాలంగా సివిల్స్ ఫలితాలు, విజేతల అనుభవాలు పరిశీలిస్తే సివిల్స్ పరీక్ష అత్యున్నతమైనప్పటికీ.. అందని ద్రాక్ష మాత్రం కాదు అని స్పష్టమవుతోంది. శాస్త్రీయంగా, ప్రణాళికబద్ధంగా సన్నద్ధమైతే ఏ నేపథ్యం ఉన్న అభ్యర్థులైనా ఇందులో విజయం సాధించడం సులభమే. కనీసం ఒక సంవత్సరం పూర్తిస్థాయి ప్రిపరేషన్ మాత్రం తప్పనిసరి.

ఇక.. మొదటిసారే విజయం సాధించిన అభ్యర్థులు కూడా ఎందరో. సివిల్స్ పరీక్షను లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు ప్రతి రోజు రేడియో, దినపత్రికలు, టీవీల్లోని వార్తలు, చర్చలు, వ్యాఖ్యానాలను క్రమం తప్పకుండా అనుసరిస్తుండాలి. వాటిపై విశ్లేషణలు చేయాలి. సమాజంలో జరిగే సంఘటనలను నిశితంగా గమనించాలి. మనోరమ ఇయర్ బుక్, ఇండియా ఇయర్ బుక్, ఎన్‌సీఈఆర్‌టీ 9 నుంచి 12 తరగతుల పుస్తకాల అధ్యయనంతో ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌కు శ్రీకారం చుట్టాలి.

మెయిన్‌‌సలో ఆప్షనల్స్ ఎంపిక ఇలా:
సివిల్స్ పరీక్ష క్రమంలో అత్యంత కీలక అంశం ఆప్షనల్స్ ఎంపిక. 2010 వరకు ప్రిలిమ్స్‌లో కూడా ఒక పేపర్ ఆప్షనల్‌గా ఉండేది కాబట్టి.. చాలా మంది అభ్యర్థులు ఒక ఆప్షనల్‌ను ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిటికీ కలిసొచ్చేలా ఎంచుకునే వీలుండేది. కానీ 2011 నుంచి ప్రిలిమ్స్‌లో ఆప్షనల్ విధానానికి స్వస్తి పలికారు. ఈ నేపథ్యంలో ఆప్షనల్స్ ఎంపిక విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.అభ్యర్థులు తాము చదివిన గ్రాడ్యుయేషన్ సబ్జెక్టులాధారంగా మెయిన్స్‌లో ఆప్షనల్ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల అకడెమిక్ స్థాయిలో పట్టున్న సబ్జెక్టులను ప్రిపేర్ కావడంలో ఇబ్బంది ఎదురు కాదు.

అయితే మూడేళ్ల డిగ్రీలో చదవని సబ్జెక్టులను సైతం ఆప్షనల్స్‌గా ఎంచుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మెయిన్స్ వ్యాసరూప సమాధానాలు రాయాల్సిన పరీక్ష. కాబట్టి బాగా పట్టున్న, విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా రాయగల సబ్జెక్టులను ఎంచుకోవడం మంచిది. అంతేకాకుండా ఆ సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్ లభ్యత, కోచింగ్ సదుపాయాలు మొదలైనవాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అవసరమైతే అంతకు ముందు సివిల్స్ విజేతలను సంప్రదించి వారి గెడైన్స్‌ను కూడా తీసుకోవడం ఉత్తమం.

ఎంపిక విధానం

ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు అంచెల్లో వివిధ సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రిలిమ్స్:
ఈ ఏడాది (2011) నుంచి ప్రిలిమినరీ పరీక్ష తీరుతెన్నులు మారాయి. ఇంతకు ముందు వరకు జనరల్ స్టడీస్‌కు 150 మార్కులు, అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షనల్ సబ్జెక్టుకు 300 మార్కులు ఉండేవి. 2011 నుంచి పేపర్-2 ఆప్షనల్ స్థానంలో ఆప్టిట్యూట్ టెస్ట్ ప్రారంభిం చారు. దీంతో పేపర్-1 జనరల్ స్టడీస్, పేపర్-2 ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు జరుగుతున్నాయి.

మెయిన్స్:
మొత్తం ఖాళీలను పరిగణించి.. 1:12 లేదా 1:12.5 నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్‌‌సకు ఎంపిక చేస్తారు. మెయిన్‌‌సలో మొత్తం 9 పేపర్లు ఉంటాయి. పేపర్-1 (రీజనల్ లాంగ్వేజ్), పేపర్-2 (ఇంగ్లిష్) కేవలం అర్హత పేపర్లే. వీటిలో సాధించిన మార్కులను ఇంటర్‌వ్యూకి ఎంపిక చేసేందుకు పరిగణించరు. పేపర్-3 జనరల్ ఎస్సే, పేపర్-4,5 జనరల్ స్టడీస్ ఉంటాయి. మిగతా నాలుగు పేపర్లు అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షనల్స్ పేపర్లు. ఒక్కో ఆప్షనల్‌కు రెండు పేపర్లు ఉంటాయి. మెయిన్‌‌స పేపర్లన్నీ డిస్క్రిప్టివ్ విధానంలోనే ఉంటాయి.

ఇంటర్వ్యూ:
మెయిన్‌‌సలో పొందిన మార్కుల ఆధారంగా ఒక్కో ఖాళీకి 1:2 లేదా 1:2.5 నిష్పత్తిలో ఇంటర్‌వ్యూకి ఎంపిక చేస్తారు. ఇది మూడొందల మార్కులకు జరుగుతుంది.
చివరకు మెయిన్‌‌స, ఇంటర్‌వ్యూలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ ప్రకారం ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.


రిఫరెన్‌‌స బుక్స్ (జీఎస్ ప్రిలిమ్స్, మెయిన్స్)
* ప్రాథమికంగా అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి ఆరు నుంచి 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల ను అధ్యయనం చేయాలి.
ఇతర రిఫరెన్‌‌స బుక్స్:
* ఇండియా ఇయర్ బుక్
* యోజన ఎకనామిక్ సర్వే
* ది హిందూ దినపత్రిక
* ఇండియన్ పాలిటీ- లక్ష్మీకాంత్
* ఇండియన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్- ఆర్.కె. అరోరా
* కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా - పి.ఎం. భక్షి
* ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ - ఆర్.ఎస్. శర్మ
* మిడీవల్ ఇండియన్ హిస్టరీ - సతీష్ చంద్ర
* మోడ్రన్ ఇండియన్ హిస్టరీ - బిపిన్ చంద్ర
* మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్ రీజనింగ్ - ఆర్. ఎస్. అగర్వాల్
* అనలిటికల్ రీజనింగ్ - పాండే
* క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - ఆర్.ఎస్. అగర్వాల్
సిలబస్, పాత ప్రశ్న పత్రాలు

సివిల్స్ పరీక్ష విధానం
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్:
సబ్జెక్ట్ పేపర్ మార్కులు
జీఎస్ 1 200
ఆప్టిట్యూడ్ టెస్ట్ 1 200
మొత్తం 400

మెయిన్స్ ఎగ్జామినేషన్:
సబ్జెక్ట్ పేపర్లు మార్కులు
జీఎస్ 2 600
ఎస్సే 1 200
ఆప్షనల్ (1) 2 600
ఆప్షనల్ (2) 2 600
మొత్తం మార్కులు 2000
ఇంటర్వ్యూ: 300

ప్రిలిమ్స్ పేపర్లకు రెండు గంటల సమయం, మెయిన్‌‌స లోని ప్రతి పేపర్‌కు మూడు గంటల సమయం లభిస్తుంది.
..................

సివిల్స్-2012 సమాచారం
* ప్రిలిమ్స్ నోటిఫికేషన్: ఫిబ్రవరి 4, 2012
* దరఖాస్తు గడువు తేదీ: మార్చి 5, 2012
* పరీక్ష తేదీ: మే 20, 2012
* మెయిన్‌‌స పరీక్ష: అక్టోబర్ 5, 2012 (21 రోజులు)
* వెబ్‌సైట్: www.upsc.gov.in

గురజాల శ్రీనివాసరావు
సబ్జెక్ట్ ఎక్స్‌పర్‌‌ట- జాగ్రఫీ, హైదరాబాద్

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...