ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసు పరీక్షలు(2012) రాసిన అభ్యర్థుల మార్కులను ‘యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్’(యూపీఎస్సీ) బయటకు విడుదల చేసింది. ఇలా అభ్యర్థుల మార్కులను బహిరంగంగా ప్రకటించడం దేశంలో ఇదే తొలిసారి. గత నెల వెలువడిన ఈ ఫలితాలతోపాటు, ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థుల వివరాలను, మార్కులను కూడా తన వెబ్సైట్లో పెట్టింది.
ఈ వివరాల ప్రకారం.. సివిల్ సర్వీసెస్కు ఎంపికైన 1004 మంది అభ్యర్థుల్లో టాపర్(హరిత వి. కుమార్)కు 53 శాతం మార్కులు వచ్చాయి. 2,250 మార్కులకు హరిత 1,193 మార్కులు సాధించారు. రెండో స్థానంలో నిలిచిన వి.శ్రీరామ్కు 51 శాతం మార్కులు(1,149), మూడో స్థానంలో నిలిచిన స్తుతి చరణ్కు 51 శాతం(1,148) మార్కులు వచ్చినట్లు వెబ్సైట్లో పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక పరీక్షల ప్రక్రియలో పారదర్శకత కోసమే ఇలా మార్కులను వెల్లడిస్తున్నారని సిబ్బంది, శిక్షణ శాఖ అధికారి ఒకరు అన్నారు. ఇక నుంచి ఇలాగే మార్కులను ఆన్లైన్లో వెల్లడించేందుకు కమిషన్ నిర్ణయించుకుందని తెలిపారు. సిబ్బంది, శిక్షణ శాఖ.. యూపీఎస్సీకి నోడల్ విభాగంగా పనిచేస్తుంది.
- సాక్షి సౌజన్యంతో..